రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని ఓ అటవీ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి నర్సింగ్ కోర్సును పూర్తిచేసింది. ఉద్యోగం కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లింది. అక్కడ ఓ యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. అతడి ప్రోద్బలంతో ఏడాది క్రితం సౌదీకి వెళ్లి, షేక్ల వద్ద పనికి కుదిరింది. ఆమెను వారు ఓ గదిలో నిర్బంధించి హింసిస్తున్నట్లు తెలిసింది. ఆ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు.. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల సెల్ఫోన్కు తాను పడుతున్న బాధలకు సంబంధించిన ఫొటోలను పంపింది. వాట్సాప్లోనే తన గోడును వెళ్లబబోసుకుంది. దీంతో వారు సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి బాధితురాలి వివరాలను పంపారు. అక్కడి అధికారులు బాధితురాలిని విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. అయితే యువతిని ఆమె స్నేహితుడు సౌదీ షేక్కు అమ్మేశాడా? లేదంటే ఆమే వెళ్లిందా ? అన్న కోణంలో ఆరా తీస్తున్నారని సమాచారం. కాగా సౌదీలో బాధితురాలు ఎక్కడుందో తెలియడం లేదని, ఆ లొకేషన్ కోసం ప్రయత్నిస్తున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
previous post