ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె చేపట్టాలని పిలుపునివ్వడంతో.. వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలతో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. సోమేశ్ కుమార్ కమిటీతో జరిగిన చర్చల్లో తమకు ఎలాంటి నిర్దిష్టమైన హామీ రాలేదని.. ఈ నెల 5 నుంచి సమ్మె యథావిథిగా ఉంటుందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టంచేశారు.
తాము కూడా సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నామనీ.. ప్రభుత్వం, కమిటీ కూడా తమ డిమాండ్లను నెరవేర్చేలా కృషిచేయాలని ఆయన కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు తమ 26 డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.