ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూల సూత్రధారి .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పాత్రధారి … తెలంగాణ ప్రజల అమ్మలగన్న అమ్మ సోనియమ్మకే అడ్రస్ లేకుండా చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అయినా, కొట్లాడి తెచ్చింది మాత్రం టీఆర్ఎస్సేనని రాష్ట్ర ప్రజలను నమ్మించిన కేసీఆర్, రెండు సార్లు సీఎంగా గెలుపొందారు. అంతేనా .. రాష్ట్ర విభజనకు ముందు పదేళ్ల పాటు అధికారంలో ఉండి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన వ్యూహ ప్రతివ్యూహాలతో చెల్లాచెదురు చేశాడు.
కాంగ్రెస్ పునాదులను కూకటివేళ్లతో సహా పెకిలించి వేశాడు. కాంగ్రెస్ నేతల మధ్య కేసీఆర్ కోవర్టులనే ప్రచారంతో చిచ్చు పెట్టాడు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్లో చేర్చుకుని మంత్రి పదవులిచ్చాడు. గులాబీ బాస్ దెబ్బకు తెలంగాణలో వందేళ్లకు పైబడి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చరిత్ర పాఠాలుగా మారే గడ్డు రోజులు దాపురించాయి. శిథిలావస్థలో ఉన్న పార్టీని నడిపించే నాథుడు లేక దివాళా స్టేజ్ లో ఉన్న పార్టీని నడిపించడానికి ఒక్కడొచ్చాడు. ఆ ఒక్కడే రేవంత్ రెడ్డి.
టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రూపు రేఖలు మార్చేశాడు. రేవంత్ చరిష్మాతో ఏడాదికి ఒక్కసారి కూడా గాంధీభవన్ మెట్లు ఎక్కని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు భయాందోళనలతో చెల్లా చెదురైన పార్టీ శ్రేణుల్లో రేవంత్ ధైర్యాన్ని నింపాడు.
గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో పని చేస్తున్న పార్టీగా ముద్ర బడిన కాంగ్రెస్ను, నేడు సీఎం కేసీఆర్ పాలిట సింహస్వప్నంగా మార్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ కోవర్టులను తరిమి కొడుతున్నాడు.వచ్చేవారిని రానీయి, వెళ్లే వారిని పోనీయ్ అనే తరహాలో పార్టీని ప్రక్షాళన చేస్తున్నాడు. సీనియర్లు, జూనియర్లు ఎవరైనా సరే మాట వింటే పార్టీలో ఉండండి, లేదంటే, మీ దారి చూసుకోమని తెగేసి చెబుతుండడంతో పాటు రోజుకో కార్యక్రమం చేపట్టి అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకు వస్తే, రేవంత్ లక్షలాది మంది దళితులతో దళిత దండోరా వేసి ముఖ్యమంత్రిపై గర్జించారు.
ఏకంగా సీఎం దత్తత గ్రామంలోనే దీక్ష చేపట్టి టీఆర్ ఎస్లో ప్రకంపనలు రేపారు. సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబాన్ని తెలంగాణ వాడవాడలా ఏకి పారేస్తున్న రేవంత్ దూకుడు వెనుక ఆ సామాజిక వర్గముందనే ప్రచారం ప్రారంభమైంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికీ మధ్య ఉన్న అనుబంధం తెలుగు ప్రజలకు సుపరిచితమే. రేవంత్కు టీపీసీసీ పీఠం దక్కడం వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని టీ కాంగ్రెస్ నేతలు పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు.
ఆ విషయంలో వాస్తవాలు ఎలా ఉన్నా, రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు భుజాలకు ఎత్తుకుంది. రేవంత్ ను ఇంద్రుడు, చంద్రుడని పొగడ్తలతో ముంచెత్తుతోంది.
సీఎం కేసీఆర్పై రేవంత్ చేస్తున్న విమర్శలకు భారీ స్థాయిలో ప్రచారాన్ని ఇస్తోంది. రేవంత్ సభల పైన, ప్రత్యేక దీక్షలకు స్పెషల్ కవరేజ్లు ఇస్తోంది. రేవంత్ కూడా పీసీసీ ప్రెసిడెంటుగా నియమితులైన వెంటనే సైకిల్ పార్టీ అభిమాన పత్రికా యజమానులు, టీవీ చానెళ్ల అధిపతులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలోని ఒక సామాజిక వర్గం ఆయనకు అండగా నిలబడింది.
ఏపీలో ఉప్పూ నిప్పులా ఉన్న చంద్రబాబు, రేవంత్ల సామాజిక వర్గాలు తెలంగాణలో ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నాయి. తెలంగాణ గడ్డపై తిరిగి చంద్రబాబు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రేవంత్ను వెనక నుండి నడిపిస్తున్నాయి. మరి ఇదే ఉత్సాహం, ప్రోత్సాహం ఎన్నికల వరకు కొనసాగితే, కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు దగ్గర పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.