తెలంగాణలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడంతో శుక్రవారం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. 7న తొలుత కో ఆప్షన్ సభ్యుల నామినేషన్ల స్వీకారం, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత ఎంపీపీ పదవులకు ఎన్నికలుంటాయి. ఒక్కో ఎంపీపీ పరిధిలో ఒక్కో కోఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక పూర్తికాకపోతే ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు అవకాశం లేదు.
ఎంపీపీ పదవులకు ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ వెబ్సైట్లో ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లను పొందుపరిచింది. ఎన్నికలు జరగనున్న మొత్తం 538 ఎంపీపీల్లో మహిళలకు 269 స్థానాలు దక్కుతాయి. శుక్రవారం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటలలోపు రాజకీయ పార్టీలు విప్ల నియామకానికి సంబంధించిన లేఖను, ఫామ్–ఎను ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
ఈ లేఖతోపాటు విప్ జారీచేసే వ్యక్తి గుర్తింపు కార్డుతోపాటు ఆధారిత లేఖ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పత్రాన్ని గురువారం అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి నుంచి విప్ అధికారం పొందిన వ్యక్తి ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో చేయి ఎత్తే పద్ధతిలో ఎవరికి ఓటేయాలన్న దానిపై సభ్యులకు విప్ జారీచేస్తారు. మెజారిటీ పొందిన వ్యక్తిని మండల పరిషత్ అధ్యక్షునిగా ప్రకటిస్తారు.