అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్… పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న ప్రోత్సాకాలను వివరిస్తున్నారు.
బిజీగా షేడ్యూల్లో ఉన్న కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి మరియు ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ తర్వాత మీటింగ్ కి బయలుదేరారు.
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ ని కొని తిన్నారు. ఆ తర్వాత మరో సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్ లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు.
ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు, కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, తర్వాత మీటింగ్ కి క్యాబ్లో వెళ్లడం వంటి విషయాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన సింప్లిసిటీకి అభినందనలు తెలిపారు.