ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు పై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే దానికి విరుగుడుగా రీవెరిఫికేషన్ తెరపైకి వచ్చింది. అయితే దానిలో కూడా అనేక తప్పులు తడకలు ఉన్నట్టు స్వయంగా వాళ్ళు చేసే ప్రకటనలే తెలుపుతున్నాయి. ఫలితాల గణాంకాల్లోనూ మరో గందరగోళానికి తెరలేపింది ఇంటర్ బోర్డు. ఉత్తీర్ణులైన వారి సంఖ్యను రోజుకో విధంగా వెల్లడిస్తూ మరిన్ని అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తోంది. ఫెయిలైన విద్యార్థుల్లో ఒకసారి 1137.. మరోసారి 1155 మంది పాసయ్యారన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్.. తాజాగా 1183 మంది ఉత్తీర్ణులయ్యారని గురువారం హైకోర్టుకు నివేదించారు. అసలు రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందా? లేదా? ఇంకా కొనసాగుతోందా? అనే విషయంలోనూ అయోమయం నెలకొంది.
మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఫెయిలైన వారిలో 1137 మంది ఉత్తీర్ణులైనట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఆ తర్వాత 4న నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 1155 మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ఈ రోజు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో మాత్రం 1183 మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. మరో 19,788 జవాబు పత్రాల స్కానింగ్, అప్లోడ్ ప్రక్రియ కొనసాగుతోందని గత నెల 27న ఓ ప్రకటనలో వెల్లడించిన ఇంటర్ బోర్డు.. మరో 800 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడించాల్సి ఉందని ఈ నెల 4న మీడియాకు తెలిపింది. కానీ.. ఇంకా మరో 8వేల జవాబు పత్రాల స్కానింగ్ జరగాల్సి ఉందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.