గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్లో విగ్రహాల నిమజ్జనంపై జీహెచ్ఎంసీ అధికారులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
కాగా..వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అంటూ జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక కూడా లేదా అని ధర్మాసనం ఆగ్రహించింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.
జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని పేర్కొంది. కాగా జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని.. లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని సర్కార్ తెలిపింది. అయితే సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్న తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.