ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సబర్వాల్కు హైకోర్టులో చుక్కెదురైయ్యింది. కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.15 లక్షలు తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ అవుట్ లుక్ మ్యాగజైన్పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫీజులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్మితా సబర్వాల్కు ప్రభుత్వం నిధులు కేటాయించడంపై హైకోర్టు తప్పుబట్టింది.
2015 జూన్ 18న హైదరాబాద్లోని ‘ది పార్క్’ హోటల్లో డిజైనర్ అభిషేక్ దత్తా ఆధ్వర్యంలో ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. అందులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన భర్తతో కలిసి ర్యాంప్ షో చేశారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ అవుట్లుక్ ఆంగ్ల వారపత్రిక 2015 జూలైలో ‘నో బోరింగ్ బాబు’ అనే శీర్షికన ఓ వ్యాసాన్ని, క్యారికేచర్ను ప్రచురించింది.
తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన నేపథ్యంలో అవుట్లుక్పై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు ఫీజు రూ.9.75 లక్షలు చెల్లించాల్సి ఉందంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సర్కారు అనుమతిస్తూ కోర్టు ఫీజుతో పాటు ఖర్చులకు కలిపి రూ.15 లక్షలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది.
ఈ జీవోను సవాల్ చేస్తూ వి.విద్యాసాగర్, కె.ఈశ్వర్రావులు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఔట్లుక్ మరో పిటిషన్ దాఖలు చేసింది.వీటిపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ధర్మాసనం.. ఈ ప్రత్యేక సందర్భంలో ఐఏఎస్ అధికారిణికి ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయడంపై కీలక ప్రశ్నలను లేవనెత్తింది.ఒక వ్యక్తి తన పరువుకు భంగం కలిగిందని సివిల్ దావా దాఖలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వొచ్చా? ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో లేనప్పుడు జరిగిన ఘటన కారణంగా ఏర్పడిన వివాదానికి ప్రభుత్వం ఖర్చు పెట్టవచ్చా? అని హైకోర్టు సీజే ధర్మాసనం ప్రశ్నించింది.
స్మితా సబర్వాల్ కు సర్కారు ఆర్థిక సాయం సరైందేనని, అఖిల భారత సర్వీసు అధికారులకు న్యాయ సహాయం చేయవచ్చని వాదించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అధికారిక విధుల్లో భాగంగా తలెత్తే వివాదాలకు మాత్రమే సహాయం చేయాలని స్పష్టంచేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 లక్షల నిధులు ప్రజాప్రయోజనం కోసం మంజూరు చేసిన నిధుల కిందికి రావని స్పష్టంచేసింది. రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తాన్ని 90 రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాలని.. లేనిపక్షంలో గడువు తీరిన 30 రోజుల్లో ప్రభుత్వమే స్వయంగా ఆమె నుంచి సదరు మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది.