సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్దతు తెలిపిన వారిపై కూడా దేశద్రోహం కేసులు పెట్టారన్నారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ సమయంలో వందలాదిమంది ఆత్మార్పణం చేశారని.. ఒత్తిడికి లోనై, ఆరోగ్యం బాగాలేక ప్రాణాలు వదిలారని.. భారతప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేసీఆర్ కోరారు. అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని అన్నారు.
అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని, రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తామని అన్నారు. అమరులైన రైతుల కుటుంబాలకు కేంద్రం రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుంచి ఇంకా ఉలుకు పలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్తోందని.. అయితే ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని కేసీఆర్ ఆరోపించారు.
ఈ విషయంపై చివరి ప్రయత్నంగా తాను కేంద్రాన్ని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఢిల్లీకి వెళ్తామని, అక్కడ కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారులను.. అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తామన్నారు. ఏడాదికి ధాన్యం ఎంత కొంటారో టార్గెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు.