*మహిళా ప్రజాదర్బార్ ప్రెస్ మీట్లో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
*రాజభవన్నే గౌరవించకుంటే..సామాన్య పరిస్థితి ఏంటి..?
*ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా పని..
*ఎన్నికల్లో గెలిచినా..నామినేటెడ్ అయినా ప్రజలు సమస్యలు పరిష్కరించడమే బాధ్యత
*నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా..నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు..
రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న కార్యక్రమాలతో ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ నేడు రాజ్భవన్ వేదికగా మహిళా దర్బార్ను నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ ఎలాంటి హద్దులు దాటడం లేదని స్పష్టం చేశారు. రాజ్ భవన్ ను గౌరవించకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. ప్రభుత్వానికి బాధ్యత లేదు..ప్రజా సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు.
మహిళా దర్బార్ వెనుక ఎలాంటి రాజకీయం లేదు. ఇంట్లో, పనిచేసే చోట, పాఠశాలల్లో, కాలేజీల్లో, రోడ్లపై మహిళలు బయటకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని.. వారు తమ సమస్యలు చెప్పుకోవడానే రాజ్భవన్లో మహిళా దర్బార్ ఏర్పాటు చేశానని తెలిపారు.
బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తే నా గుండె రగిలిపోతోంది. జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నివేదిక ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నాను. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం నా విషయంలో ప్రొటోకాల్ పాటించలేదు. దీనిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. తెలంగాణ ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటాను. నన్ను వ్యతిరేకంగా మాట్లాడే వారిని నేను పట్టించుకోనని చెప్పారు..
గవర్నర్ ప్రజలను కలువగలరా అని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా ప్రజల కోసమేనని చెప్పారు. కరోనా సమయంలో తనను చాలామంది ఆపినా తాను ఆగకుండా కొందరి కోవిడ్ రోగుల ను వెళ్లి పరామర్శించానని చెప్పారు.
.