ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్… దిల్లీ పర్యటనకు బయల్దేరారు. శాసనసభ సమావేశం, బీఏసీ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తన బృందంతో హస్తినకు పయనమయ్యారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. శనివారం రోజు.. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారు.
ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా… ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చిస్తారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కేసీఆర్ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం చర్చిస్తారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.