దేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం నివాసంలో ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్ ప్రత్యేక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్, బీబీ పాటిల్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు.
భేటి అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాలపై చర్చించేందుకే మహారాష్ట్రకు వచ్చానని కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల సంబంధాలు, పరస్పర సహకారంపైనా చర్చించామని సీఎం తెలిపారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించామన్నారు. కేంద్ర సంస్థలను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. వైఖరి మార్చుకోకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
ప్రస్తుత తరుణంలో ప్రాంతీయ పార్టీలన్ని ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమేనన్న కేసీఆర్.. మున్ముందు పురోగతి వస్తుందన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
అలాగే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను హైదరాబాద్ రావాలని కోరుతున్నానని కేసీఆర్ తెలిపారు.రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు నెలకొన్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు.
దేశంలో గుణాత్మకమైన మార్పు అవసరం. అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. రాబోయే రోజుల్లో కలిసి పని చేయాలని నిర్ణయించామన్న కేసీఆర్.. త్వరలో హైదరాబాద్లో లేదా మరో చోట అందరం నేతలం కలుస్తామన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.