వరి ధాన్యం విషయంలో కేం ద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన రాకేష్ టికాయత్కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చి దీక్ష చేయడానికి కారణమెవరని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీకి నేను ఒక్కటే చెబుతున్నా.. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ రైతులతో మాత్రం కాదన్నారు.
కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు.
నరేంద్ర మోదీకి, పీయూష్ గోయల్కు రెండు చేతులూ జోడించి కోరుతున్నా.. మిగతా రాష్ట్రాల్లో ఎలా ధాన్యం కొంటున్నారో తమ దగ్గర కూడా అలాగే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కోనుగోళ్లపై 24 గంటల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కొనకపోయినా ఫర్వాలేదని అన్నారు. కేంద్రంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతునే ఉంటుందని తెలిపారు. తాము పేదవాళ్లమేమీ కాదని.. రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కేంద్రానికి ఎదురుతిరిగితే సీబీఐ, ఈడీ కేసులు పెడతారన్న కేసీఆర్… భాజపాలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. తనను జైలుకు పంపుతామని రాష్ట్ర భాజపా నేతలు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి.. అని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని పిలుపునిచ్చారు.