*కాంగ్రెస్తో కలిసి ఒకే వేదికపై రాలేమని చెప్పిన టీఆర్ ఎస్
*మమత మీటింగ్కు హాజరుకాకుడదని కేసీఆర్ నిర్ణయం..
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరున అభ్యర్దిని ఎంపిక చేసేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ భేటీకి కాంగ్రెస్ను కూడా ఆహ్వానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపే విషయమై ఢిల్లీలో ఇవాళ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి బీజేపీయేతర పక్షాలకు పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు ఆహ్వానాలను పంపారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానం పంపారు.
అయితే, విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తొలుత సీఎం కేసీఆర్ వెళ్లకుండా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, కేశవరావులను పంపుతారేమోనన్న చర్చ జరిగింది.
అయితే చివరకు పార్టీ తరఫున కూడా ఎవరూ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్ధి… కాంగ్రెస్ పార్టీతో కలిసి వేదికను పంచుకొంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. దీంతో మమత నిర్వహించే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఇవాళ ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు విపక్ష పార్టీల సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే, సుర్జీవాలే, జైరాం రమేశ్ హాజరుకాబోతున్నారు. ఇక, మమత బెనర్జీ ఆహ్వానించిన వారిలో సమావేశానికి ఎవరొస్తారో, డుమ్మా కొట్టేదెవరో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.