ఆర్జేడీకి అవకాశం లభిస్తే బీహార్లో నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువకులు చేతులు కలపాలని ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రతి ఒక్కరు లైట్లు ఆర్పివేసి 9 నిమిషాలపాటు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని కోరారు. తాను కూడా తల్లి రబ్రీదేవితో కలిసి అదే సమయానికి ఇంట్లోని లైట్లు ఆర్పివేసి లాంతర్లు వెలిగిస్తామని తేజస్వీయాదవ్ తెలిపారు.
తమది రాజకీయ ఆందోళన కాదని, నిరుద్యోగులైన యువకులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ ఉద్యమాన్ని చేపట్టాయని తెలిపారు. నిరుద్యోగులంతా ఈ ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు వెబ్సైట్, టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తామన్నారు.