telugu navyamedia
క్రీడలు వార్తలు

టీం ఇండియా కెప్టెన్ కు కరోనా పాజిటివ్…

భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌‌ సునీల్‌ ఛెత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు వైరస్‌ సోకిందని భారత స్టార్‌ స్ట్రైకర్‌, బెంగళూరు ఎఫ్‌సీ సారథి సునీల్ ఛెత్రి ట్విటర్లో గురువారం వెల్లడించాడు. దీంతో మార్చి 25న దుబాయ్‌ వేదికగా ఒమన్‌తో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే వేదికపై మార్చి 29న యూఏఈతో జరిగే స్నేహపూర్వక మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. సునీల్‌ తన ట్విట్టర్ లో ‘ఇదొక చేదువార్త. ఈరోజు నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. వైరస్‌ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాను. అతి త్వరలోనే ఫుట్‌బాల్‌ మైదానంలో మళ్లీ అడుగుపెడతాను. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వద్దు’ అని భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌‌ పేర్కొన్నారు.

Related posts