ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ‘వందేమాతరం’ పాడేందుకు నిరాకరించిన ముస్లిమ్ ఉపాధ్యాయుడిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అఫ్జల్ హుసేన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ‘వందేమాతరం’ పాడేందుకు అఫ్జల్ హుసేన్ నిరాకరించాడు.
తమ మతపరమైన నమ్మకాలకు ఇది విరుద్ధమని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఉపాధ్యాయుడు అఫ్జల్ హుసేన్ పై దాడి చేశారు. ఉపాధ్యాయుడిపై దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని జిల్లా విద్యాశాఖాధికారి దినేష్ చంద్రదేవ్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని డీఈవో తెలిపారు.