ఏపీ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 16 నెలల్లో ప్రజలపై రూ.20వేల కోట్ల భారం మోపారని వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే తొలి త్రైమాసికంలో 363శాతం అప్పులు పెరిగాయన్నారు.
కోవిడ్ ప్రత్యేక సాయం లేకుండా ప్రజలపై పన్నుల భారం వేశారన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రూ లక్షా 10వేల కోట్లు తెచ్చారు. వీటన్నింటి భారాలను అంతిమంగా ప్రజలపైనే మోపారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నివిధాలా అధోగతి పాలు చేస్తోందని దుయ్యబట్టారు. నిత్యావసరాల ధరలు, పన్నులు పెంచేసి పేదల బతుకును దుర్భరంగా మార్చారన్నారు.
రెండు ప్రధాన కారణాల వల్ల ఏపి ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని తెలిపారు. అభివృద్ది పనులపై, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్దిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ప్రధాన కారణమని అన్నారు.
సాంఘిక ఆర్ధికాభివృద్దిపై తీవ్ర ప్రభావాన్ని ఇది చూపిందని తెలిపారు. కోవిడ్ 19 వైరస్ నియంత్రణపై నిర్లక్ష్యం చేయడం మరో ప్రధాన కారణమని అన్నారు. సహజ వనరులను వైసీపీ మాఫియా దోచుకుంటోందని అన్నారు.
చంద్రబాబు జోలె పట్టి నాటకాలాడుతున్నారు: అంబటి