ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వం పోయి, ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చిందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విపక్ష నేతలపై దాడులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు.నెల రోజుల్లోనే ప్రభుత్వ అసమర్థత అందరికీ అర్థమవుతోందని చెప్పారు. ఈ ఖరీఫ్ లో కరవు పరిస్థితి నెలకొందని, విత్తనాలు దొరక్క రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.
విత్తనాలకు రూ. 380 కోట్లు కూడా ఇవ్వలేని వారు, వేల కోట్ల రూపాయల హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. నినాదాలు పుష్కలం, నిర్వహణ అధ్వానం అనే రీతిలో జగన్ పాలన సాగుతోందని యనమల విమర్శించారు. కమిటీల పేరుతో అమరావతి నిర్మాణాన్ని ఆపేశారని మండిపడ్డారు. పేదలకు మేలు చేస్తానని వచ్చిన జగన్ ఒక ఫాసిస్టుగా మారారని అన్నారు. మా భవనాలను, పేదల ఇళ్లను కూల్చినంత మాత్రాన మీరు గొప్పవారు కాలేరని హితవు పలికారు.
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు