మూడు రాజధానులనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైకోర్టు వేరే చోట ఉండవచ్చు కానీ, మూడు రాజధానులు మంచిదికాదని తెలిపారు. జగన్ కు, ఆయన అనుచరులకు విశాఖపై కన్ను పడిందని అన్నారు.
ఏపీ సీఎం జగన్ ఇప్పటికే కడప, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల ప్యాలెస్ లు కట్టుకున్నారనిరేపు విశాఖపట్నం వెళ్తే అక్కడ మరో ప్యాలెస్ కడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద పెంచుకోవాలన్న ఆలోచన జగన్ చేయట్లేదని అన్నారు. తన సంపద, తన అనుచరుల సంపద పెంచుకోవడంపైనే సీఎం ఆలోచిస్తున్నారని విమర్శించారు.
విశాఖలో ఎప్పటినుంచో అభివృద్ధి ఉందని అన్నారు. సంపద సృష్టించడానికి టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు కృషి చేసిందని యమనల అన్నారు. అమరావతిలో అక్కడ కనీస మౌలిక సదుపాయాలున్నాయని, సంపద పెరిగితే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పక్కనపెట్టి జగన్ వివాదాలు తెరపైకి తెస్తున్నారని యనమల దుయ్యబట్టారు.