ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సర్కారు సన్నద్ధమవుతున్న తరుణంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా రూపొందించిన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందన్నారు. ఆమేరకు శివరామకృష్ణ కమిటీ నివేదిక అనుసరించి అమరావతిని ఎంచుకున్నారని తెలిపారు.
విభజన చట్టంలో ఎక్కడా రాజధానులు అనే మాట లేదని అన్నారు. ఇప్పటి ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా మూడు రాజధానులు చేయాలంటే మాత్రం విభజన చట్టంలో ఆ మేరకు సవరణ అవసరం అని స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటు అనేది కేంద్రం పరిధిలోని అంశమని పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫారసుల ఆధారంగానే రాజధాని ఏర్పాటు కావాలని విభజన చట్టంలో ఉందని యనమల తెలిపారు.