ఏపీ భవిష్యత్తు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించలేని ఆంధ్రప్రదేశ్ సర్కారు.. రాష్ట్రాన్ని ఎలా ప్రగతి పథంలో నడిపించగలదని ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు. వైఎస్ సర్కారు అసమర్థ విధానాలతో భవన నిర్మాణ కార్మికులు తిండిలేక అల్లాడుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
ఐదు నెలలు ఏమీ పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తే ఉపయోగమేంటని నిలదీశారు. తాపీ మేస్త్రీల నుంచి సిమెంట్ కంపెనీల వరకు ఎవరికీ పని దొరకకుండా సర్కారు చేసిందని ఆయన విమర్శించారు. ఐదు నెలలుగా మాడుతున్న పేదల కడుపులు ఇసుక వారోత్సవాలతో నిండుతాయా? అని ప్రశ్నించారు. ప్రజల సొత్తుతో సకల సౌకర్యాలు పొందుతున్న ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.