ఏపీ సీఎం జగన్ పై మాజీమంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది జగనేనని అన్నారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వస్తామంటున్న పెద్ద కంపెనీలను తరిమికొట్టి అక్కడి యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కొత్త ఉద్యోగాలు సృష్టించకుండా ఉన్న కార్యాలయాలు అటూ ఇటూ మార్చి అభివృద్ధి చేస్తానంటే నమ్మేవాళ్లు ఇక్కడెవరూ లేరంటూ వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్నాం అనే స్పృహ లేకుండా టీడీపీ నాయకులను అడ్డుకోవడమే హీరోయిజం అనుకుంటున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే వారి నాయకుడు జగన్ ను అడ్డుకోవాలని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయబోతున్నారంటూ ప్రశ్నించాలని లోకేశ్ హితవు పలికారు.