రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు భారీ ఎత్తున తెలగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీక్షకు భవన నిర్మాణ కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలను నిర్వహించడం సిగ్గు చేటని అన్నారు. ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలను జరపాలని అన్నారు. ఇసుక కొరత వల్ల చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10 వేలు పరిహారంగా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.