కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు అధ్వానంగా ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కరోనా రోగి బాత్రూంలో పడి చనిపోయిన ఘటన తీవ్రంగా కలచివేసిందని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన ద్వారా ప్రభుత్వ చర్యలు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తోందని విమర్శించారు.
సీఎం జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు గడప కూడా దాటడంలేదని విమర్శించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందని పేర్కొన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు శూన్యమని, ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడంలేదని ఆరోపించారు. నిత్యం కరోనాపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది రోడ్ల మీదకు వచ్చి నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వాలి అంటూ ఆందోళనలు చేస్తున్నారని లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.