ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ మాట మారుస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూ నవరత్నాలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని స్వయంగా కేంద్రమే చెప్పిందనీ ఆయన గుర్తుచేశారు. లేనిపోని రాద్ధాంతం చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారని అన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని విమర్శించడం తప్ప ఒక్కటైనా నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు కులాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు స్వప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారని ఆరోపించారు.