జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోందని టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి విమర్శించారు. నేలపాడు ఎస్ఆర్ఎం వర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళుతున్న రోజాను పెదపరిమి వద్ద రాజధాని రైతులు అడ్డగించగా, ఆమె చాలాసేపు కార్లోనే కూర్చుండిపోవాల్సి వచ్చింది. దీనిపై నన్నపనేని ఘాటుగా స్పందించారు.
రైతులు రోజాను జై అమరావతి అనాలని కోరారని, దీనికి రోజా కార్లో కూర్చునే సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం ఏంటి? ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటి? అని మండిపడ్డారు. అసలు, రోజా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టేందుకు ఆమె వచ్చారని ఆరోపించారు.