సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న తరుణంలో వైసీపీలో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. తాజాగా టీడీపీ నేత, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. అంతకుముందే తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి మోదుగుల రాజీనామా సమర్పించారు. వైసీపీ నేతల విజయసాయిరెడ్డితో కలిసి ఈరోజు జగన్ ఇంటికి వెళ్లిన మోదుగుల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మోదుగులకు పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మీడియాతో మోదుగుల మాట్లాడుతూ.. టీడీపీ నేత గల్లా జయదేవ్ గుంటూరుకు గెస్ట్ లాంటివారని విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని తెలిపారు. జగన్ ను సీఎం చేసేందుకు ఓ సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. .జయదేవ్ గుంటూరుకు రావడం, పోవడం తప్పితే ఓ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎన్నడూ వ్యవహరించలేదని ఆరోపించారు. .టీడీపీలో ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక పార్టీకి రాజీనామా చేశానని మోదుగుల వెల్లడించారు.