కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మణిగాంధీ మాట్లాడుతూ వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తాను వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు విధి విధానాలు నచ్చక తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తన పట్ల చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన వాపోయారు. పార్టీలో కొంతమందికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని దూరం పెడుతున్నారని అందువల్లే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.
2014 ఎన్నికల్లో మణిగాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం నియోజకవర్గం అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు టికెట్ను బి.రామాంజనేయులుకు చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మణిగాంధీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.