వైసీపీ అంటే ‘‘యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ ’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో పాల్గొన్న ఆయన ఏపీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాముడు అయితే జగన్ రాక్షసుడని ఎద్దేవా చేశారు. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో ఈ రోజు ప్రత్యేకమైన స్థానమన్నారు.
చంద్రబాబు నాయుడు రాముడులాంటి వ్యక్తని.. ఆయన పరిపాలించిన 14 ఏళ్లలో కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టలేదని లోకేష్ గుర్తుచేశారు. రాముడు వున్నప్పుడు రాక్షసుడు కూడా వుంటాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి పునాదులు గట్టిగా ఉన్నాయని.. ఎవ్వరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని చాలా మంది చెప్పారని, వారిలో కొందరు గాలికి కొట్టుకుపోయారని , మిగిలిన కొందరు వాళ్లే భూస్థాపితమైపోయారని లోకేష్ అన్నారు.
టీడీపీ కార్యకర్తల శరీరం కోస్తే పసుపు రక్తం వస్తుందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలను చంపే ముందు వైసీపీ నేతలు జై జగన్ అనమన్నా.. జై తెలుగుదేశం అనే కార్యకర్తలున్న పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పార్టీ వైసీపీ అని నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు.
సీఎం అయిన దగ్గరి నుంచి జగన్ జేసీబీ పాలన చేస్తున్నాడని.. ప్రజావేదిక కూల్చాడని, అక్కడి నుంచి పేదల ఇళ్లపై పడ్డాడని ఫైరయ్యారు. చంద్రబాబుకు ముందు చూపుంటే .. జగన్కు మందు చూపు వుందంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. కన్నతల్లిని, చెల్లిని, అన్నదాతలను, యువతను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం నెంబర్వన్గా వుందని లోకేష్ గుర్తుచేశారు
ఇక చంద్రబాబు కుంభకోణాలన్ని వెలుగులోకి వస్తాయి: విజయసాయి