దళితులను వైసీపీ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. బాబూజగజ్జీవన్ రామ్ బావాజాలానికి, అంబేద్కర్ ఆశయాలకు, గుర్రంజాషువా సిద్దాంతాలకు వ్యతిరేకంగా జగన్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బుధశారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ అధికారంలోకి వచ్చాక వారిని అణచివేస్తున్నారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే రాష్ర్టంలో దళితుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ కార్పోరేషన్ను నిర్వీర్యం చేశారని అన్నారు. ఈ 14 నెలల వైసీపీ పాలనలో ఒక్క దళితుడికైనా రుణం మంజూరు చేశారని ? అని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల్లో దళితులను ఎందుకు నియమించలేదని నిలదీశారు. సలహాదారు పదవికి దళితులు పనికిరారని సాక్ష్యాత్తు సీఎం అసెంబ్లీలో మాట్లాడి దళితులను అవమానపరిచారని కళా వెంకట్రావు మండిపడ్డారు.
అమరావతిలో అంబేద్కర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందుకే అంబేద్కర్ సృతివనాన్ని నిలిపివేసి, మరో విగ్రహం పెడతామంటూ న్యాయస్థానాల్లో చిక్కుల్లో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసిందన్నారు. జగన్ 14 నెలల పాలనలో దళితులపై జరిగినన్ని దాడులు బ్రిటిష్ వారి హయాంలో కూడా జరగలేదని అన్నారు.