ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి ఈరోజు దివాకర్ రెడ్డి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గవర్నర్, ఈసీ ఎవరూ ఉండకూడదని జగన్ భావిస్తున్నారని జేసీ అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి… పక్కన పోలీసులు ఉంటే సరిపోతుందనే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఒక భస్మాసురుడు ఉన్నాడని.. తన నెత్తి మీద తానే చేయి పెట్టుకున్నాడని అన్నారు. ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలందరికీ తెలుసని జగన్ పై పరోక్ష విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేయడం మంచి నిర్ణయమని చెప్పారు. జగన్ చాలా తెలివైనవాడంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. సామాజికవర్గం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుందని జేసీ వ్యాఖ్యానించారు.