టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో ఇటీవల టీడీపీ నేత నాగరాజు ఇంటి చుట్టూ వైసీపీ నేత పెద్దిరెడ్డి బండలు పాతించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రహదారి వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లాలని ప్రయత్నించిన జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బండలు నాటిన స్థల వివాదం కోర్టులో ఉందని మొదట ఆయనకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దివాకర్ రెడ్డి ఆ గ్రామంలోకి వెళ్లడానికి యత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు.