ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే మాత్రం అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు తమపై అనేక పోస్టులు పెట్టారని, వీటిపై ఎలాంటి చర్యలూ లేవన్నారు. ఈ విషయమై పోలీసులు చర్యలు తీసుకోకపోతే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అచేతనంగా మారిపోయిందని దుయ్యబట్టారు.
పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి చులకన కావొద్దని సూచించారు.టీడీపీకి చెందిన మరో నేత నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, సీఎం కార్యాలయం ఆదేశాల మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలపై తమకు ఇంకా నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని పోలీసులు కాపాడాలని సూచించారు. అత్యుత్సాహం చూపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.