తెలుగు మాధ్యమం నిలిపివేయడం తెలుగు భాష ఉనికికే ప్రమాదమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు, ఇంగ్లీష్ రెండు మాద్యమాల్లో బోధన సాగాలని సూచించారు. ఎవరికి ఏ మాధ్యమం కావాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమం బడులు నడుస్తున్నాయని గుర్తుచేశారు.
దూరదృష్టి లేకుండా రాబోయే పరిణామాలు ఊహించకుండా తెలుగు మాధ్యమం ఎలా ఎత్తి వేస్తారని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒక్కసారిగా ఇంగ్లీష్లోకి ఎలా మారతారని డొక్కా ప్రశ్నించారు. ఉపాధ్యాయుల నియామకాల కోసం ఇంగ్లీషు, తెలుగులో వేర్వేరుగా డీఎస్సీ నిర్వహించాలని కోరారు. లేకపోతే ప్రస్తుత ఉపాధ్యాయులకు ఇంగ్లీషు బోధన చేయడం కష్టమని అన్నారు. టీడీపీ ఆంగ్ల మాద్యమానికి వ్యతిరేకం కాదని రెండు మాధ్యమల్లో బోధన సాగాలని ఆయన కోరారు.