రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని దేవినేని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. విజయవాడ గొల్లపూడి సెంటర్లో జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఏపీలో రాజధానిని మార్చవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్దతుగా గొల్లపూడి సెంటర్లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్-విజయవాడ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
మాపై ఎందుకు ఈ పగ? అంటూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.