తెలంగాణా సీఎం కీసీఆర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ దోస్తీ పరిణామాలు ఏపీ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగేలా ఉన్నాయని మాజీ డిప్యుటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పుకొచ్చారు. శనివారం కాకినాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. ఇది కూల్చి వేతల ప్రభుత్వమని చినరాజప్ప చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.
చంద్రబాబు నివాసం ఉంటున్న బిల్డింగ్కు అన్ని అనుమతులూ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నదీ తీరాల్లో వేల సంఖ్యలో ప్రభుత్వ, ప్రయివేటు భవనాలు ఉన్నాయని, వాటన్నింటినీ కూలుస్తారో లేదో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాజధాని, పోలవరం పనులు ఆపేశారని, ఇలా అన్నింటా కక్ష సాధింపు సమీక్షలంటూ అభివృద్ధిని గాలికి వదిలేశారని రాజప్ప దుయ్యబట్టారు. కేవలం నెలరోజుల్లోనే జగన్ పాలన ఏలా ఉంటుందో ప్రజలకు తెలిసిపోయిందన్నారు.