ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికలు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి పొత్తులపై కీలకవ్యాఖ్యలు చేశారు.
కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న బాబు.. శుక్రవారం నాడు అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అంతా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు.
మనకు ఎందుకులే అని వదిలిస్తే.. అరాచక పాలన కారణంగా రాష్ట్రం రావణకాష్టం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల కోసం అంతా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కేవలం పొత్తుపై వ్యాఖ్యలు చేయడమే కాదు.. అలా అన్ని పార్టీలు ముందుకు వస్తే.. అరాచక ప్రభుత్వానికి కిందకు దించడానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది అన్నారు.
టీడీపీ నేతలపై కేసులు పెడితే ఎవరైనా భయపడతారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే.. మీపై వ్యతిరేకత తగ్గుతుందా? మరింత రెచ్చపోతాం.. గట్టిగా పనిచేస్తాం అన్నారు చంద్రబాబు.
అలాగే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. ‘అన్నిరంగాల్లో ప్రజలపై ప్రభుత్వం బాదుడే బాదుడు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఆడబిడ్డ తల్లుల పెంపకం సరిగాలేదంటూ..మహిళా హోంమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరం. ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ప్రచారాలు తప్ప చేసిందేమీ లేదు.
సొంత బాబాయిని చంపిన వ్యక్తులను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్. జగన్ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.
అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి’ అని కార్యకర్తల సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తంగా.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.