కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబుమండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. ప్రజలు అసలే కరోనా భయంతో ఉంటే సీఎం చేస్తోన్న వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించేలా ఉంటున్నాయని దుయ్యబట్టారు. కరోనా తగ్గదు.. రాష్ట్రంలోని అందరికీ కరోనా వస్తుందేమోనని జగన్ అన్నారని వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టాలని, నేను మొదటి నుంచే చెబుతున్నానని తెలిపారు. కంటోన్మెంట్ జోనులు పెట్టాలని నేను మొదట్లోనే చెప్పాను. కరోనాను కట్టడి చేయాలని అనేక సూచనలు చేశాను. పట్టించుకోలేదని చంద్రబాబు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలన్నీ సక్రమంగా అమలు చేయాలి. లాక్డౌన్ నిబంధనలు వైసీపీ నేతలకు పట్టవా? రాష్ట్రంలో అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అనేక విషయాల్లో బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా దోపిడీ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుతిరుగుతున్నారని మండిపడ్డారు.