ఇసుక రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచకుండా పోలీసు ఎస్కార్టుతో బెంగళూరు తరలిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కడప జిల్లాలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఇసుక అంశంలో ఏపీ మంత్రులపై విరుచుకుపడ్డారు. కడప జిల్లాలో ఉండాల్సిన ఇసుక బెంగళూరులో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
టీడీపీ హయాంలో ఇసుక అక్రమరవాణా జరుగుతోందని ఆనాడు ఆరోపించారు. మరిప్పుడు మీరు చేస్తున్నదేంటి? మా హయాంలో ఇసుకధరలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్న మీరు దానికంటే తక్కువ ధరకు ఎందుకు ఇవ్వడంలేదు? వీళ్లను ఏ భాషలో తిట్టాలో కూడా అర్థం కావడంలేదు. ఇసుకంతా నదులు, వాగుల్లో పెట్టాం, వరదొచ్చి కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఈ మంత్రులు, ఈ నాయకులు ఎవరి చెవుల్లో పూలు పెడతారని ప్రశ్నించారు.