ఏపీ నుండి భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నిందితులపై సమగ్ర విచారణ చేయకుండా ఇతరులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. తమిళనాడులో కారులో డబ్బు పట్టుబడిన వ్యవహారాన్ని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు.
ఇటీవల పట్టుబడిన డబ్బుకు సంబంధించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తమిళనాడు అంతటా మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయని, కానీ ఆ వ్యవహారంలో సందీప్, చంద్రశేఖర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారని చంద్రబాబు వెల్లడించారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ అనేక పోలీస్ స్టేషన్లు మార్చుతూ దారుణంగా కొట్టారని ఆరోపించారు. ఏపీలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, వేధింపులు చోటుచేసుకుంటున్నాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.