ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కోడ్’ఉల్లంఘనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన బాబు, స్థానిక సంస్థల ఎన్నికల తాజా పరిణామాలను వివరించారు. అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ అధికార పార్టీ దాడులు చేస్తోందని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ని జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అభ్యర్థులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని, నామినేషన్ల పరిశీలనలోనూ ఏవో ఒక వంకలు పెడుతూ తిరస్కరిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.