శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హెచ్చరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దౌర్జాన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ నేతలు వెళ్లే ప్రభుత్వ రోడ్డుపై గోడ కట్టారని ఆరోపించారు. దీనిపై పోలీస్ శాఖ, మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో ప్రభుత్వం ఈ గోడపై తగిన చర్యలు తీసుకోకపోతే తాము న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు.
మరోవైపు ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమ్మపురం టీడీపీ మహిళా కార్యకర్తపై అతి దారుణంగా దాడి చేసి హత్య చేశారని చంద్రబాబుఆరోపించారు. అడ్డుకున్న భర్తపై సైతం దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా హోంశాఖ మంత్రిగా ఉన్న సుచరితకు ఆ మహిళ సమస్య కనబడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అత్యంత దారుణంగా వైసీపీ నేతలు హత్య చేశారని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.