వైసీపీ ప్రభుత్వం పై మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడవకుండానే ఎన్నో అరాచకాలు చేశారని నిప్పులు చెరిగారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రశ్నాపత్రాన్ని టైప్ చేసిన వారికే మొదటి ర్యాంక్ వచ్చిందని, ప్రభుత్వ అక్రమాలపై ఇంతకన్నా రుజువేం కావాలని ప్రశ్నించారు.
కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పరీక్షలు రాయవద్దని తాను చెప్పడం లేదని, కానీ, వారికే మొదటి ర్యాంక్ రావడం వెనుక ఎంత కుట్ర దాగుందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం మీడియాను నియంత్రణలో ఉంచుకోవాలని చూస్తోందని, ముఖ్యంగా ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తి చూపే పత్రికలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.