వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీనే ఘనవిజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతోందని, ఏపీని అరాచక ఆంధ్రప్రదేశ్ మార్చారని మండిపడ్డారు.
జగన్ కాస్త ముందు పుట్టి ఉంటే హిట్లర్ పేరు ప్రపంచానికి తెలిసేది కాదని ఎద్దేవా చేశారు. కౌరవులు వందమంది ఉన్నట్టు వైసీపీకి 151 మంది ఉన్నారని, కానీ ధర్మం చంద్రబాబు పక్షానే ఉందని వ్యాఖ్యానించారు. మహానాడులో చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేయడంతో, బీసీలను టీడీపీకి దూరం చేయాలని జగన్ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు.