వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పేదవాడి ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి చులకన అయిపోయిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులు పడుకుంటున్నారన్నారు.
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వారాలతో ప్రజలు అల్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. డెంగ్యూ అని తెలిసినా అధికారికంగా నిర్దారించకుండా రోగులను వెనక్కు పంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షం నీరు నిలుస్తున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని బోండా మండిపడ్డారు. ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.