ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ జగన్ సర్కార్ పై విమర్శనాస్తాలు సంధించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ కల్పన చేయాల్సిన ముఖ్యమంత్రి మద్యం బ్రాండ్లు నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. మద్యం బ్రాండ్ల ముసుగులో రూ.2000 కోట్లు దోచేస్తారా? అని నిలదీశారు.
మొన్న కేసీఆర్, జగన్ గంటల కొద్దీ చర్చించింది బయటపెట్టలేదు, కానీ ఇప్పుడర్థమవుతోంది ఇద్దరూ మాట్లాడుకుంది బ్రాండ్ల గురించేనని దుయ్యబట్టారు. రూ.50, రూ.60 ఉన్న మద్యం సీసాలపై రూ.250 పెంచితే రాష్ట్రంలో మద్యం మాఫియా పెరగదా అని నిలదీశారు. ఓ బాటిల్ పై ఏకంగా రూ.250 పెంచడం అంటే నిరుపేదలను దోపిడీ చేయడమేనని అన్నారు. నిషేధం ముసుగులో మద్యం తయారీదారులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.