ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ ఉద్యోగులకు భరోసా కల్పించింది. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా కష్టకాలం ముందున్నప్పటికీ ఉద్యోగుల్లో ఒక్కరిని కూడా తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాదికి జీతాల పెంపుదల మాత్రం ఉండక పోవచ్చునని తెలిపింది.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో పెద్ద, చిన్న అన్న తేడా లేకుండా అన్నిరంగాల్లోనూ ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.
వివిధ కంపెనీల్లో జీతాల్లో కోత వేగవంతంగా సాగుతున్న సమయంలో టెక్ దిగ్గజం టీసీఎస్ తమ సంస్థంలోని నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులకు ఊరటనిచ్చే మాట చెప్పింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంస్థ మంచి లాభాలనే అందిపుచ్చుకున్నప్పటికీ వచ్చే రెండు త్రైమాసికాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చునని ఊహిస్తోంది. అయినప్పటికీ ఉద్యోగాల్లో కోత వేయకూడదన్నది యాజమాన్యం నిర్ణయమని టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథ్ తెలిపారు.