తాప్సి దక్షిణాదిలో అడపాదడపా నటిస్తూ దృష్టి నంతా బాలీవుడ్పైనే సారిస్తోంది. అక్కడ ఈ అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే అక్కడ కూడా ఈ బ్యూటీ కొందరి నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోందట. అందేంటంటే ఈ అమ్మడు ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనే నటిస్తోంది. నిజానికి అలాంటి కథా చిత్రాలే తాప్సీకి పేరు తెచ్చిపెడుతున్నాయి. అయితే అలాంటి హీరోయిన్ సెంట్రిక్ పాత్రల్లో నటించరాదని, స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే కథా పాత్రల్లో నటించాలని తాప్సీపై ఆమె సన్నిహితులు కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఈ విషయాన్ని తనే బయట పెట్టింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని అటుంచితే ఇప్పుడు దేశం అట్టుడికిపోతున్న అంశం పౌరసత్వ బిల్లు.
దీనిపై బాలీవుడ్, కోలీవుడ్ టాలీవుడ్ నటీనటులు రకరకాలుగా స్పందిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ విషయంపై నటి తాప్పీ మాత్రం చాలా తెలివిగా స్పందించింది. తనకు అంత రాజకీయ పరిజ్ఞానం కాదు కదా, సాధారణ పరిజ్ఞానం కూడా లేదు అని బదులిచ్చింది. ఒక అంశంపై మాట్లాడే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అంది. నిజానికి తనకు పౌరసత్వ చట్టం గురించే సరిగా అవగాహన లేదని చెప్పింది. కాబట్టి ఈ విషయంలో తానెలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని దయచేసి దాని గురించి అడగకండి అంటూ విజ్ఞప్తిచేసింది. అయితే ఏదో ఒక విషయం జరగబోతోందన్నది మాత్రం తెలుస్తోందని తాప్సీ పేర్కొంది.