దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మహాత్ముడికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీకి అసలైన వారసుడు జగనేనని వ్యాఖ్యానించారు.
మహాత్ముడు చూపిన మార్గాన్ని జగన్ తు.చ తప్పకుండా అనుసరిస్తున్నారని కొనియాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.జనం కడుతున్న ట్యాక్సులతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను నడిపిస్తోందని టీడీపీ అంటోందని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు జనాల నుంచి ట్యాక్సులు వసూలు చేయలేదా? అని తమ్మినేని ప్రశ్నించారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రాకుండా చంద్రబాబు అండ్ కో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.